ఫార్ములా ఈ–కారు రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విచారణ చేపట్టేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. దీనితో ఈ కేసులో కేటీఆర్పై చార్జ్షీట్ దాఖలు చేసే ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ లభించినట్టైంది.
కేటీఆర్పై విచారణకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గవర్నర్కు అధికారిక లేఖ పంపింది. ఆ లేఖపై గవర్నర్ సానుకూలంగా స్పందించి అనుమతి మంజూరు చేసినట్లు తెలిసింది.
ఈ కేసు రాజకీయ వేడి పుట్టిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఇప్పటికే నాలుగు సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. తనపై పెట్టిన ఆరోపణలు పూర్తిగా ఉద్దేశపూర్వకమైనవని, వాస్తవాలకు దూరంగా ఉన్నాయనీ, సర్కార్ చేసిన నిందారోపణలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించనని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఫార్ములా ఈ–రేసు కేసులో ఈ తాజా పరిణామంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.





